ఖమ్మం మధ్య గేటు వద్ద ఆర్వోబికి గ్రీన్ సిగ్నల్

  • భూ సేకరణ కోసం వేచి చూస్తున్నాం
  • రాష్ట్ర ప్రభుత్వం వెంటపడుతున్నాం
  • రాగానే పనులు మొదలు పెడతాం
  • ఎంపీ వద్దిరాజు వినతికి రైల్వే అధికారుల స్పందన

ఖమ్మం, డిసెంబర్, 16: మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు

ఖమ్మం నగరంలో రెండు ప్రధాన వ్యాపార కూడళ్లు గాంధీ చౌక్, కమాన్ బజార్లను కలిపే మధ్యగేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబి) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే అందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి, తమ అప్పగిస్తే అక్కడ పనులు మొదలు పెడతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు.
ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల కోరిక మేరకు మధ్య గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం కోరుతూ.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రైల్వే జీఎం కు గత నెలలో ఓ వినతిపత్రం అందజేశారు. ఆ మేరకు రైల్వే జీఎం స్పందించి ఆయకు ప్రత్యుత్తరం రాశారు. ఖమ్మం – పందిళ్ళపల్లి మధ్యలో 104 లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఆర్వోబి
నిర్మాణం భూ సేకరణ అంశంతో ముడిపడి ఉన్నందున, అందుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రైల్వే జీఎం తెలియజేశారు. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెడతామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ తన లేఖలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు స్పష్టం చేశారు.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed