ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 01




ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు
ఖమ్మం, ఆగస్టు 1:
ఈరోజు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ రైతు బజార్ అడ్డా నందు ఆటో కార్మికులు ఉత్సాహంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డా ప్రెసిడెంట్ బండారి బాబు, ఆటో కమిటీ సభ్యులు సమాఖ్యంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ పగడాల నాగరాజు గారు కేక్ కట్ చేసి కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆటో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, “గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, గౌరవ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆటో కార్మికుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించారు. పోలీసుల, ఆర్టీఏ అధికారుల ఒత్తిడి లేకుండా, ఆటో కార్మికులకు రక్షణ కల్పించే విధంగా పనిచేశారు,” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఆటో డ్రైవర్లను మోసం చేస్తున్నదని ఆరోపించారు. “డబుల్ బెడ్రూం ఇళ్లు, సంవత్సరానికి ₹12,000 ఉపాధి ప్రోత్సాహం, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు వంటి హామీలను తక్షణమే అమలు చేయాలి,” అంటూ ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో BRTU ఆటో యూనియన్ జిల్లా నాయకులు సత్తార్ మియా, నగర కమిటీ సభ్యులు వేణు సంగం, అడ్డా నాయకులు శ్రీనివాసరావు, రఘు, శంకర్, శివ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు, డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని దినోత్సవాన్ని జరుపుకున్నారు.
