పరిశుభ్రమైన ఖమ్మం నగరం తయారు చేసేందుకు ప్రజలు సహకరించాలి…. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు
*ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 11వ డివిజన్ వరదయ్య నగర్ లో పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల
ఖమ్మం జూన్ 25 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు
పరిశుభ్రమైన ఖమ్మం నగరం తయారు చేసేందుకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
మంత్రివర్యులు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 11వ డివిజన్ వరదయ్య నగర్ లో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ వానలు రాక ముందే కార్పోరేషన్ అధికారులు ప్రత్యేక చొరవతో కాల్వలో మురుగు నీరు నిల్వ ఉండకుండా, ఎక్కడా చెత్త పేరుకొని పోకుండా, దుర్గందం రాకుండా 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకుని గత 20 రోజులుగా ప్రతి డివిజన్ లో ప్రజల సహకారంతో ముందుకు సాగుతున్నారని అన్నారు.
ప్రతి ఇంటి నుంచి చెత్తను రోజూ సేకరిస్తున్నట్లు, రోడ్లు, డ్రైయిన్ లలో చెత్త వేయవద్దని అన్నారు. పరిశుభ్రమైన ఖమ్మం తయారు చేసేందుకు కార్పొరేషన్ చేసే కృషికి ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు, మన పిల్లలకు మంచి ఆరోగ్యం లభిస్తుందని అన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ, 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రతి డివిజన్ లో ఉన్న డ్రైయిన్లను శుభ్రం చేయడం, పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, పిచ్చి మొక్కల తొలగింపు వంటి కార్యక్రమాలను చేపట్టామని అన్నారు.
నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ 11వ డివిజన్ లో ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమం చేపట్టామని, రోడ్లను, డ్రైయిన్ లను శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల క్రితం వర్షాకాలంలో పారిశుద్ద్య నిర్వహణకు వంద రోజుల స్పెషల్ డ్రైవ్ చేపట్టామని అన్నారు.
అంతకుముందు మంత్రివర్యులు వరదయ్య నగర్ లో మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్ర, పబ్లిక్ హెల్త్ ఇఇ వి. రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.








