భద్రాది జిల్లా (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఆగస్టు 18))

ఇల్లందు నియోజకవర్గంలో రూ. 22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.

ఇల్లందు నియోజకవర్గంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విస్తృతంగా పర్యటించి, 22 కోట్ల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు.

టేకులపల్లి మండల పరిధిలో పంచాయతీరాజ్ శాఖ చేపడుతున్న కోక్యా తండా నుండి పాత తడికలపూడి వరకు 1.25 కోట్ల రూపాయలతో బీటీ రహదారి, థవుర్యా తండా నుండి కోక్యా తండా వరకు 1.45 కోట్ల రూపాయలతో బీటీ రహదారి, థవుర్యా తండా నుండి పాత తడికలపూడి వరకు లక్ష్మీపురం వద్ద రూ. 83 లక్షల వ్యయంతో స్లాబ్ కల్వర్ట్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పాతతండా నుండి రాంపురం వరకు2.5 కోట్ల రూపాయలతో హై లెవల్ వంతెన నిర్మాణానికి పేట్రంచేలక వద్ద రెండు కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణానికి, కిష్టారం గ్రామంలో పీఆర్ రోడ్ నుండి స్మశానవాటిక వరకు హై లెవల్ వంతెన నిర్మాణానికి మూడు కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.

ఇల్లందు మండల పరిధిలో మొండికుంట నుండి రామచంద్రాపురం రహదారిపై వాగు వద్ద ఆరు కోట్ల రూపాయలతో నిర్మించనున్న హై లెవల్ వంతెన , ఇల్లందు పట్టణంలోని జె.కె. కాలనీలో 1.56 కోట్లతో మినీ స్టేడియం అభివృద్ధి పనులు మరియు సౌకర్యాల కల్పనకు పనులకు, శంకుస్థాపన చేశారు. రహదారులు మరియు భవనాలు శాఖ ఆధ్వర్యంలో ఇల్లందు మండలంలోని లలితాపురం గ్రామంలో ఖమ్మం–యెల్లందు రహదారి విస్తరణ, డివైడర్లు మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు రూ. 3.5 కోట్ల వ్యయంతో పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కి కట్టుబడి ఉందని, ముఖ్యంగా రహదారులు, వంతెనలు, క్రీడా మైదానాలు వంటి మౌలిక వసతులను కల్పించడం ద్వారా ప్రజలకు శాశ్వత సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి రవాణా సౌకర్యాలు అత్యంత కీలకమని, ఈ దిశగా రోడ్లు, వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లాలో రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలు అమలులోకి రాబోతున్నాయని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఆర్ అండ్ బి శాఖ ఈ ఈ వెంకటేశ్వరరావు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed